Sunday, May 25, 2025
Homeజాతీయంముమ్మాటికీ ద్వేషపూరితమే

ముమ్మాటికీ ద్వేషపూరితమే

- Advertisement -

– యోగా బాబా రాందేవ్‌కు ఢిల్లీ హైకోర్టు అక్షింతలు
– భవిష్యత్‌లో అలాంటి వీడియోలు, పోస్టులు పెట్టబోమని పతంజలి గ్రూప్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలి
న్యూఢిల్లీ: ప్రజాదరణ పొందిన రూహ్‌ అఫ్జా పానీయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను పెట్టిన వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులను తొలగించేందుకు యోగా గురువు బాబా రాందేవ్‌ మంగళవారం అంగీకరించారు. రూహ్‌ అఫ్జాను లక్ష్యంగా చేసుకొని బాబా రాందేవ్‌ చేసిన ‘షర్బత్‌ జిహాద్‌’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. రాందేవ్‌ వ్యాఖ్యలు సమర్ధనీయం కావని, దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించేందుకు పతంజలి సంస్థ అంగీకరించింది. ఈ విషయాన్ని రాందేవ్‌ న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు.
రాందేవ్‌ వ్యాఖ్యలపై రూహ్‌అఫ్జా పానీయం ఉత్పత్తిదారు హమ్‌దర్ద్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. రాందేవ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ‘వీడియోను చూసిన తర్వాత నేను నా కళ్లను, చెవులను నమ్మలేకపోయాను’ అని వ్యాఖ్యానించారు. హమ్‌దర్ద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఇది తన క్లయింటును చిన్నచూపు చూడడం కంటే పెద్ద విషయమని, అది మతపరమైన విస్మరణను సృష్టించే ఉద్దేశంతో చేసిన ద్వేషపూరిత ప్రసంగమని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. వాటిని తొలగిస్తున్నామని రాందేవ్‌ న్యాయవాది హామీ ఇవ్వడంతో ‘భవిష్యత్తులో ఇలాంటి పోస్టులను సోషల్‌ మీడియాలో పెట్టబోనని, ఇలాంటి ప్రకటనలు చేయబోనని, వాణిజ్య ప్రకటనలు ఇవ్వబోనని రాందేవ్‌ నుండి అఫిడవిట్‌ తీసుకోండి’ అని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసులు ఇక ముందు తమ ముందుకు రావాలని తాము కోరుకోవడం లేదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఐదు రోజులలోగా అఫిడవిట్‌ సమ ర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -