నవతెలంగాణ హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ మెజీషియన్, మానసిక వైద్య నిపుణుడిగా పట్టాభిరామ్ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు.
బీవీ పట్టాభిరామ్.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో ఒకరు. చిన్నతనంలోనే కాలి వైకల్యంతో కలిగిన ఆత్మన్యూనతా భావాన్ని జయించారు. ఆ తరువాత తనని తాను మెజీషియన్ గా, రచయితగా తీర్చిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే మెజీషియన్ నుంచి ఇంద్రజాల విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసేవారు. 1970 నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్ ఎదిగారు.
బుధవారం అంత్యక్రియలు
ఖైరతాబాద్లోని స్వగృహంలో పట్టాభిరామ్ భౌతికకియాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
BV Pattabhiram