Friday, June 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహామీ ఏం రాలే..

హామీ ఏం రాలే..

- Advertisement -

డీఏలు, పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ, సీపీఎస్‌ రద్దుపై స్పష్టత లేదు
నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి
ప్రభుత్వంపై మాకు నమ్మకముంది
సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ చేపడతాం : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ శ్రీనివాసరావు
మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీ, ఉద్యోగ జేఏసీ సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు అధికారుల కమిటీ సభ్యులూ పలుమార్లు సమావేశాలను నిర్వహించారు. సమస్యలు వినడమే తప్ప అవి పరిష్కారం కావడం లేదు. తాజాగా బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌ భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉద్యోగ జేఏసీతో సమావేశాన్ని నిర్వహించారు. సుమారు రెండుగంటలపాటు సమస్యలపై మళ్లీ చర్చించారు. ఉద్యోగ జేఏసీ నాయకులు మరోసారి సమస్యల గురించి వివరించారు. కానీ మంత్రివర్గ ఉపసంఘం సమస్యలకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఎన్ని డీఏలను ప్రభుత్వం ప్రకటిస్తుందో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సుమారు రూ.11 వేల కోట్లు వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఎలా విడుదల చేస్తారో, ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రకటించలేదు. 2023, జులై ఒకటి నుంచి పీఆర్సీ అమలు కావాలి. ఆ నివేదిక ఎప్పుడు వస్తుందో, ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా ప్రకటించలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దానిపైనా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఆర్థిక సమస్యలతోపాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం నుంచి హామీ రాలేదు. ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందనీ, వాటిని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న హామీని మాత్రమే భట్టి విక్రమార్క ఇవ్వడం గమనార్హం. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యారు. కనీసం డీఏల గురించైనా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఈ సమావేశాన్ని నిర్వహించడంలో ఆంతర్యమేంటో అర్థం కాలేదంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీ, ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు డి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, అధికారుల కమిటీ చైర్మెన్‌, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌, సభ్యులు లోకేష్‌కుమార్‌, కృష్ణభాస్కర్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జీఏడీ ముఖ్యకార్యదర్శి మహేష్‌ దత్‌ ఎక్కా, ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, కోచైర్మెన్లు చావ రవి, జి సదానందంగౌడ్‌, వంగ రవీందర్‌రెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్‌ పుల్గం దామోదర్‌రెడ్డి, ముజీబ్‌ హుస్సేనీ, ఎ సత్యనారాయణ, నాయకులు ఎ వెంకట్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్‌, బి శ్యామ్‌, కటకం రమేశ్‌, సిహెచ్‌ అనిల్‌కుమార్‌, తరాల జగదీశ్‌, కృష్ణయాదవ్‌, సి జగదీశ్‌, ఎండీ అబ్దుల్లా, మణిపాల్‌రెడ్డి, యాదగిరి, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.
క్యాబినెట్‌లో నివేదిక సమర్పిస్తాం… పరిష్కారం కనుగొంటాం : భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల సమస్యలపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నివేదికను సమర్పిస్తామనీ, పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలనే మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీని సీఎం రేవంత్‌రెడ్డి నియమించారని గుర్తు చేశారు. సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొన్నేండ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయామని అన్నారు. ఎక్కువ కాలం వాటిని పెండింగ్‌లో ఉంచకుండా, పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని చెప్పారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నింటితోపాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని వివరించారు. ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. పదేండ్ల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయనీ, అయినా ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలనీ, సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన లో భాగంగానే మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. వనరులు సమకూర్చుకుని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకుపోతు న్నామని వివరించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెండ్లీలు, ఆస్పత్రుల ఖర్చులకు సంబం óంచిన సమస్యలపై మంత్రివర్గ సహచరులతో అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని వ్యాఖ్యానించారు. అధికారుల కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందించి మంత్రివర్గ సమావేశంలో నివేదిస్తామని వివరించారు.
వయో పరిమితి పెంపు లేదు : ఉద్యోగ జేఏసీ
రాష్ట్రంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపు లేదనీ, ప్రభుత్వంలో ఎక్కడా ఆ చర్చ జరగలేదని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో చెప్పారు. వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 57 డిమాండ్లలో 12 ఆర్థికపరమైనవి, 45 ఆర్థికేతర సమస్యలున్నాయని వివరించారు. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకముందనీ, త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. గురువారం జరిగే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని అన్నారు. ఒకవేళ సమస్యలను పరిష్కరించకుంటే కార్యాచరణ చేపడతామన్నారు. దశలవారీగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఐదు డీఏలను ప్రకటించాలనీ, పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు రూ.11 వేల కోట్లు చెల్లించాలనీ, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సస్పెండ్‌ అయిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సూచించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తేవాలని అన్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏడాది నుంచి సర్పంచ్‌ల్లేరనీ, ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నదనీ, నిధుల్లేక పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -