నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వికలాంగుల కార్పొరేషన్ గ్రీవెన్స్ (వినతుల స్వీకరణ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల మొదటి, నాలుగవ బుధవారాల్లో హైదరాబాద్లోని వికలాంగుల సహకార సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మెన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో తొలిసారిగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా వినతులను స్వీకరించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లోని వికలాంగుల కార్పొరేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో వికలాంగుల నుంచి 103 వినతులను స్వీకరించారు. వికలాంగుల నుంచి ఇందిరమ్మ ఇండ్లు, వికలాంగుల ఉపకరణాలు, సదరం సర్టిఫికెట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, బ్యాక్ లాగ్ పోస్టులు, పోలీస్, జీహెచ్ఎంసీ, ఎండోమెంట్, ఆర్టీసీ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు కోసం వినతులు వచ్చినట్టు ముత్తినేని వెల్లడించారు. వికలాంగులకు నిత్యం అందుబాటులో ఉంటాననీ, వికలాంగులైన నిరుద్యోగుల ఉపాధి కోసం వివిధ శాఖల అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు. ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కృషి చేయనున్నట్టు ఆయన చెప్పారు.
వికలాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ తొలిరోజు 103 వినతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



