నవతెలంగాణ- హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ ఘటనలో 36 మంది కార్మికులు, సిబ్బంది మరణించారని, మరో 34 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్లు వివరించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత పదమూడు మంది కార్మికులు కనిపించకుండా పోయారని సమాచారం. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.
గుర్తించిన మృతదేహాల వివరాల ఆధారంగా 14 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో పదమూడు మంది సిబ్బంది కనిపించడంలేదని తెలిపింది. ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ పదమూడు మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సిగాచి పరిశ్రమ వద్ద మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.