నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్తో 24మంది చిన్నారుల మృతి ఘటన మరువక ముందే ఆస్పత్రిలోని యాంటీబయాటిక్ బాటిల్లో పురుగుల ఘటన వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదు మేరకు యాంటీబయోటిక్ మొత్తం స్టాక్ను సీలు చేశామని, పరీక్ష కోసం నమూనాలను భోపాల్ ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. గ్వాలియర్ జిల్లాలోని మోరార్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
మోరార్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక మహిళ అజిత్రోమైసిన్ సిరప్ (ఓరల్ సస్పెన్షన్)లో పురుగులు ఉన్నాయని ఫిర్యాదు చేసినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆ మహిళ తీసుకువచ్చిన బాటిల్ను పరిశీలించామని అన్నారు. అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ సాధారణంగా వివిధ ఇన్ఫెక్టన్లను తగ్గించేందుకు వైద్యులు సూచిస్తారని, ఈ ఔషధాన్ని జనరిక్ మరియు మధ్యప్రదేశ్కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిందని అన్నారు. ఆస్పత్రిలో నిల్వ చేసిన 306 బాటిల్స్ను వెనక్కి తీసుకున్నామని అన్నారు. కొన్ని ఔషదాల బాటిల్స్ను ప్రాథమికంగా తనిఖీ చేసినపుడు పురుగులు కనిపించలేదని, కానీ పరీక్షకు పంపామని అన్నారు. కొన్ని బాటిల్స్ను పరీక్ష కోసం భోపాల్లోని ల్యాబ్కు పంపామని చెప్పారు. ఔషదం నమూనాను కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్ లాబరేటరీకి కూడా పంపుతామని వెల్లడించారు.
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన 24 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్తో కిడ్నీ ఫెయిలై మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ టిఆర్ మరియు రీలైఫ్లను నాసిరకం దగ్గు సిరప్లు ప్రకటిస్తూ నిషేధం విధించింది.