నవతెలంగాణ-హైదరాబాద్: రైల్వేలో టిక్కెట్లను బుక్ చేసే ఐఆర్సిటిసి వెబ్సైట్ శుక్రవారం డౌనైంది. దీపావళి కోసం టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతుండటంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరగనున్నాయి. దీపావళి వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు అధికశాతంమంది రైల్వేను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐఆర్సిటిసి వెబ్సైట్ డౌనైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వెబ్సైట్లో అంతరాయం ఏర్పడిందని, ఉదయం 10.00 గంటలకు సుమారు 6,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేయగానే.. ”ఈ సర్వర్ తాత్కాలికంగా సేవలను అందించలేకపోతుంది. ఎర్రర్ కోడ్ 119” అంటూ స్క్రీన్పై ప్రత్యక్షమౌతోంది. ఐఆర్సిటిసి యాప్ను వినియోగిస్తున్నవారు కూడా సాంకేతిక సమస్య గురించి ఫిర్యాదు చేశారు. సర్వర్ డౌన్కావడం, పండుగ సీజన్లో టిక్కెట్లను బుక్ చేసుకోలేకపోవడం పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ నిలిచిపోవడంపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.