– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వామపక్షాలు
న్యూఢిల్లీ : అన్ని సైనిక చర్యలను నిలిపివేస్తూ భారత్, పాకిస్తాన్లు ఒక అవగాహనకు వచ్చాయని ఈ నెల 10వ తేదీన ప్రకటించిన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపులు, ట్రోలింగ్పై మోడీ ప్రభుత్వం మౌనంగా వుండడాన్ని వామపక్షాలు ప్రశ్నించాయి.
మిస్రి, ఆయన కుమార్తెలను ఆన్లైన్ ట్రోల్ చేస్తున్న వార్తకు సంబంధించిన ఫోటోను సీపీఐ(ఎం) ఎక్స్ పోస్టులో షేర్ చేసింది. ”ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఊరుకుంటోంది? ట్రోల్స్ చేయడం సిగ్గుచేటు” అని సీపీఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భారత ప్రభుత్వం పరిగణించిన వైఖరిని మాత్రమే విదేశాంగ కార్యదర్శి వ్యక్తీకరించారని బ్రిట్టాస్ పేర్కొన్నారు.
”పాలక పక్షం ఆమోదించిన విధానాలను, నిర్ణయాలను ఆయన వ్యక్తీకరించడాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం, అందుకు ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దూషించడం విచారాన్ని కలిగిస్తున్నాయి.” అని బ్రిట్టాస్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సైబర్ దాడి తర్వాత మిస్రి తన ఎక్స్ ప్రొఫైల్ను నిలిపివేశారు. ”ప్రభుత్వ విధానాలకు కేవలం కట్టుబడినందుకు ఎదురయ్యే దూషణ ఛీత్కారాలను తప్పించుకునేందుకు దేశంలోనే సీనియర్ మోస్ట్ అయిన దౌత్యవేత్త ఇలా డిజిటల్ వేదిక నుంచి ఉపసంహరించుకున్న వాస్తవం అనూహ్యమైనది, ఆందోళన కలిగిస్తోంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి భయం, బెదిరింపులు లేకుండా తమ విధులు నిర్వహించుకునేందుకు ఉద్యోగులకు గల అవకాశాలు వేగంగా కుంచించుకుపోతుండడం గురించి ఒక దుష్ట సంకేతాన్ని పంపిస్తోందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. సహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ వినరు నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్పై కూడా ఇలాగే ఆన్లైన్ ట్రోలింగ్ జరిగిందని బ్రిట్టాస్ గుర్తు చేశారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, విద్వేష రాజకీయాలే ఈ పరిస్థితికి దారి తీశాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బాహటంగా దీని గురించి మాట్లాడి, సమస్యను పరిష్కరించాలన్నారు. మిస్రి ఏమీ సామాన్య వ్యక్తి కాదు, ఆయనో ఉన్నత స్థాయి అధికారి. ఆయనకే రక్షణ లేనపుడు ఇక ఎవరికి వుంటుందని రాజా ప్రశ్నించారు. ప్రభుత్వం రెచ్చగొడుతున్న దూకుడుతో కూడిన జాతీయవాదం ఫలితమే ఇదని రాజా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిప్రకటించినందుకు మిస్రిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. ”దూకుడుతో కూడిన జాతీయవాద భావాలను రెచ్చగొట్టే వ్యక్తులు అడ్డూ అదుపు లేకుండా చేసే ఇలాంటి దూషణలతో కూడిన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్న భారత విదేశాంగ కార్యదర్శి తన ఎక్స్ హ్యాండిల్ను కాపాడుకోవాల్సి వచ్చింది. ప్రధాని తీసుకున్న నిర్ణయానికి విదేశాంగ కార్యదర్శిని ఎందుకు ట్రోల్ చేస్తారు? ఉగ్రవాదుల మతోన్మాద కుట్రను భగం చేసినందుకు భారత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేసినందుకా? అని ప్రశ్నించారు.
మిస్రిపై ట్రోలింగ్ పట్ల మౌనమేలా ?
- Advertisement -
- Advertisement -