నవతెలంగాణ-హైదరాబాద్: దీపావళి పండుగ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ( ) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రాజధాని ప్రాంతంలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 257గా నమోదైంది.
అత్యధికంగా ఆనంద్ విహార్లో ఏక్యూఐ స్థాయి 413గా నమోదైంది. వజీర్పూర్లో 342, షాదీపూర్లో 329, జహన్గిరిపురిలో 320, పంజాబీ బాగ్లో 296, బురారి ప్రాంతంలో 292, అలీపూర్లో 289, అశోక్ విహార్ ప్రాంతంలో 284, ఐటీవో 284, సోనియా విహార్లో 264, గురుగ్రామ్లోని సెక్టార్ 51లో 330, ఫరీదాబాద్లో 229, ఘజియాబాద్లోని ఇందిరాపురంలో 300, నోయిడాలో 307, మీటర్లో 263గా గాలి నాణ్యత సూచీ నమోదైంది.
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని (cloud seeding) కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు. ఐఐటీ-కాన్పూర్ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు ఐఎండీ, ఐఐటీఎమ్-పుణె తోడ్పాటును అందిస్తున్నాయి. దీపావళి తర్వాత పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో అయిదు చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు.



