– ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ -పరకాల : విద్యార్థి సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాడే విద్యార్థి సంఘం, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ.) పరకాల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్, శారద హై స్కూల్లలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.ఎఫ్.ఐ. హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, పరకాల పట్టణంలో ఉన్న ఎస్.ఎం.హెచ్. హాస్టల్కు సొంత భవనాలను నిర్మించాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పరకాల పట్టణంలో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ఎస్.ఎఫ్.ఐ.లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. మండల అధ్యక్షుడు, కార్యదర్శి ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, పట్టణ కార్యదర్శి సాయి తేజతో పాటు పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.



