పాట్నా : బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు నేతలపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వేటు వేసింది. మహాగట్బంధన్ ప్రకటించిన అభ్యర్థులకు, పార్టీకి వ్యతిరేకంగా కార్యకలా పాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆర్జేడీ సోమవారం ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27మందిని పార్టీ నుండి బహిష్కరించినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ నేతలను ఆరేళ్ల పాటు బహిష్కరించడంతో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ మంగని లాల్ మండల్ పేర్కొన్నారు. సరన్ జిల్లాలోని పర్సా నియోజకవర్గ ఎమ్మెల్యే చోటెలాల్ రాయ్, మరో ఎమ్మెల్యే మొహమ్మద్ కమ్రాన్లపై సస్పెండైన వారిలో ఉన్నారు. నవాడా జిల్లాలోని గోవింద్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బహిష్కరణకు గురైన వారిలో కతిహార్ నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్ ప్రకాష్ మహ్రా, ముజఫర్పూర్ నుంచి అనిల్ సాహ్ని, బధారా నుంచి సరోజ్ యాదవ్ , అనిల్ యాదవ్ కూడా ఉన్నారు.
ఆ జాబితాలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రీతూ జైస్వాల్ కూడా ఉన్నట్టు మీడియా తెలిపింది. ఆర్జేడీ టికెట్ నిరాకరించడంతో సీతామర్హి జిల్లాలోని పరిహార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి జైస్వాల్ నామినేషన్ను దాఖలు చేశారు. మోతిహరి నుంచి మహిళా సెల్ జిల్లా అధ్యక్షురాలు పునమ్ దేవి గుప్తాను కూడా బహిష్కరించినట్టు నివేదించింది. ఈ జాబితాలో ఉన్న సీనియర్ నేతలు సరన్ జిల్లాలోని సెన్పూర్కు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర ప్రసాద్ యాదవ్ , వైశాలికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర కుష్వాహాలు ఉన్నారు. జేడీ(యూ) తన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు సహా 16 మంది నేతలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. బీహార్లో రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. మహాగట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీలు భాగంగా ఉన్నాయి.
ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27మందిపై ఆర్జేడీ వేటు
- Advertisement -
- Advertisement -



