నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పార్టీ మారుతున్నానని కావాలని బీఆర్ఎస్ వాళ్లు, మా పార్టీలోని కొందరు నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆ పుకార్లను నమ్మొద్దు అని ఆయన తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
రాజకీయంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని వెల్లడించారు. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త , ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానన్నారు. ప్రస్తుతం తనముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు రూ.500 కోట్లతో ప్రణాళిక రూపూదిద్దబోతుందన్నారు. చౌటుప్పల్ చెరువు నుండి ఏలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరదనీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పింది అని చెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవలసిన చర్యలతో అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.



