ఫైనల్లో పుణెరి పల్టన్పై గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12
నవతెలంగాణ-న్యూఢిల్లీ
దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) చాంపియన్గా నిలిచింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఉత్కంఠభరితంగా సాగిన పీకెఎల్ 12వ సీజన్ టైటిల్ పోరులో మాజీ చాంపియన్ పుణెరి పల్టన్పై 31-28తో దబంగ్ ఢిల్లీ మెరుపు విజయం సాధించింది. పీకెఎల్ 8వ సీజన్లో జోగిందర్ నర్వాల్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్ సాధించిన దబంగ్ ఢిల్లీ.. తాజా సీజన్లో అతడి శిక్షణ సారథ్యంలో విజేతగా నిలువటం విశేషం. రెయిడింగ్లో, డిఫెన్స్లో పుణెరి పల్టన్, దబంగ్ ఢిల్లీ సమవుజ్జీలుగా తలపడ్డాయి. ప్రథమార్థంలో 20-14తో ఆరు పాయింట్ల ఆధిక్యం సాధించిన దబంగ్ ఢిల్లీ… ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించింది.
పుణెరి పల్టన్ మెరుగైన ప్రదర్శనతో పాయింట్ల అంతరం కుదించినా.. దబంగ్ ఢిల్లీని ఒత్తిడికి గురి చేయలేకపోయింది. నీరజ్ నర్వాల్ (9 పాయింట్లు), అజింక్య పవార్ (6 పాయింట్లు), ఆషు మాలిక్ (2 పాయింట్లు), సుర్జీత్ సింగ్ (2 పాయింట్లు) దబంగ్ ఢిల్లీ తరఫున రాణించారు. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆదిత్య షిండె (10 పాయింట్లు), అవినాశ్ (4 పాయింట్లు), పంకజ్ మోహిత (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పీకెఎల్ 12 సీజన్ ఉత్తమ రెయిడర్గా అయాన్ (పట్నా పైరేట్స్), ఉత్తమ డిఫెండర్గా నవదీప్ (పట్నా పైరేట్స్), నయా యంగ్ ప్లేయర్గా దీపక్ శంకర్ (బెంగళూరు బుల్స్) అవార్డులు అందుకున్నారు. పీకెఎల్ 12 చాంపియన్షిప్ టైటిల్ను దబంగ్ ఢిల్లీ అందుకుంది.



