సోషలిస్టు విధానాలకు పెరుగుతున్న ఆదరణ : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నయా ఉదారవాద విధానాలు ఆర్థిక సంక్షోభాల నుంచి ప్రపంచ దేశాలను గట్టెక్కించే స్థితిలో లేవనీ, సోషలిస్టు విధానాలే ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల్లో తమ్మినేని పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పయనిస్తుందనీ, అమెరికా డాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాల కూటమి చైనా నాయకత్వంలో ముందుకు వచ్చిందని తెలిపారు. ఆయా దేశాల స్థానిక కరెన్సీలో ప్రపంచ వ్యాపారానికి ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. దీంట్లో భారతదేశం కూడా భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం మంచి పరిణామమని తెలిపారు. 
నయా ఉదారవాద విధానాల వల్ల నిరుద్యోగం, పేదరికం, ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు కార్మికులు నిజ వేతనాలు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నదని వివరించారు. మరో పక్క ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. సామ్రాజ్యవాద దేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని అమ్ముకునేందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తన మాట వినని దేశాలపై సుంకాలు విధించటానికి అమెరికా సిద్ధపడిందని తెలిపారు. చిన్న చిన్న దేశాలు సైతం అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే. మోడీ మాత్రం నోరు విప్పడం లేదని విమర్శించారు. 
రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని బెదిరించటం, భారత్ పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానంటూ చెబుతున్నా మోడీ మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అమెరికా విధించిన టారిఫ్లను యథావిధిగా అమలు చేస్తే వ్యవసాయ రంగంలో సోయాబీన్, పత్తి, బియ్యంతో పాటు మత్య్స, చేనేత పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ఆధారంగా బతుకుతున్న అనేక మంది ఉపాధిని కోల్పోతారని చెప్పారు. మోడీ, ట్రంప్ లాలూచిని ఎండగడుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కేంద్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, నారి ఐలయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

                                    

