సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి
అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. అక్టోబర్ విప్లవం, రష్యా విప్లవ దినోత్సవాన్ని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జి బాలస్వామి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రష్యా విప్లవ నేత వి ఐ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బర్ పాల్గొని ప్రసంగించారు. అక్టోబర్ విప్లవంతో వినూత్నమార్పు దోపిడీ, పీడన లేని సమాజం సాధ్యమేనని చూపెట్టినది జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడి విజయం శాంతి, అందరికీ భూమి, ఆహారం హామీలను నెరవేర్చిన సోవియట్ యూనియన్ అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందనీ, దోపిడీ, పీడన లేని సమాజం సాధ్యమేనని చూపెట్టినదని మహోత్తర పోరాటం అది అని అక్టోబర్ విప్లవ దినోత్సవానికి నవంబర్ ఏడో తేదీన జరుపుకోవడానికి గ్రిగేరియన్ క్యాలెండర్ కారణమన్నారు.
లెనిన్ నేతృత్వంలోని బోల్షివిక్ పార్టీ, బూర్జువాలు కలిసి రష్యాలో జార్ చ్రకవర్తుల పాలనను కూలదోసి ఫిబ్రవరి 17న ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే, ప్రజలు ఆశించిన విధంగా యుద్ధాల నుంచి విముక్తి, రైతులకు భూమి, అందరికీ రేషన్ అందించేందుకు బూర్జువాలు సిద్ధంగా లేకపోవడంతో ప్రజల సహకారంతో అక్టోబర్ విప్లవం ద్వారా లెనిన్ నాయకత్వంలో రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆ ప్రభుత్వం యుద్ధాల నుంచి శాంతి కలిగించి పేదలకు భూములను పంచిందనీ, అందరికీ రేషన్, సంక్షేమం అందించిందని వివరించారు. 70 ఏండ్లపాటు రష్యా సోషలిస్టు ప్రభుత్వం ప్రపంచానికి ప్రత్యామ్నాయ పాలన అందించిందన్నారు. ఆ 70 ఏండ్లలో అనేక దేశాల నేతలు సోషలిస్టు భావజాలం వైపు మొగ్గు చూపారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన పాలకులు తీసుకున్న విధానాలతో 1989-90 సోషలిస్టు వ్యవస్థ కూలిపోయిందన్నారు.
దీంతో కమ్యూనిస్టుల పని అయిపోయిందనీ, పెట్టుబడి దారీ వ్యవస్థలోనూ ప్రజల సంక్షేమం ఉందని ప్రచారాన్ని కొన్న శక్తలు చేపట్టాయన్నారు. సిద్ధాంతాన్ని అమలు చేయడంలో నాయకుల నిర్ణయాలు సరిగా లేకపోవచ్చుగానీ, ఎప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతం అత్యున్నతమైదని ఆనాడే సీపీఐ(ఎం) సగర్వంగా చెప్పిందన్నారు. ఒకదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం, సోషలిస్టు వ్యవస్థ నిర్మించడం వేరు వేరు అంశాలన్నారు. ఉత్పత్తి విధానంలో మార్పు, ఆర్థిక విధానాలు, ఉద్యోగాల కల్పన, మహిళలకు సమాన అవకాశాలు వంటి అంశాల్లో మార్పులు రాకుండా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన సోషలిస్టు వ్యవస్థగా మారిందని చెప్పలేమన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనీ, సంపద సృష్టించాలనీ, పోగైన సంపదను పంచాలని చెప్పారు.
.ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్థ పని అయిపోయిందన్న పెట్టుబడిదారీ దేశాలు సంతోషపడుతున్న సమయంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్టు వ్యవస్థ నేడు ప్రపంచం ముందుకు బలంగా వచ్చిందన్నారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో చైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు గట్టయ్య బిసన్న ఎం మన్యం ఉమా నందిమల్ల రాములు నందిమల్ల రత్నమ్మ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



