నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు గ్రామ ఆదివాసి నాయక్ పోడ్ ఆధ్వర్యంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతామని నాయకపోడ్ కుల సంఘం పెద్దలు సాంపల్లి సాయిలు, మేట్టు బోజన్న, మాజీ సర్పంచ్ ఘనపురం వనిత భూమయ్య వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. గ్రామంలో ఈ పండగ సందర్భంగా గజాలను తీసుకొని గంగలో స్నానం చేయించి వాటిని తీసుకొని ఊరేగింపుగా వచ్చి భీమన్న వద్ద పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ భీమన్న పండుగ కార్తీక మాసంలో ఆదివాసి నాయకపోడు కులస్తులు ఐదు రోజుల ముందు నుండి బట్టలు పిండుకోవడం,ఇల్లు శుభ్రం చేసుకోవడం, బంధువులను పిలుచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
పండగ సందర్భంగా కులస్తులందరూ ఒకరోజు ముందు పందిరి వేయడం, తెల్లారి పూజ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అదే రాత్రి భజన చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా మూడు రోజులు ఈ పండుగ జరుపుకోవడం, మళ్ళీ వారం తర్వాత మారు నైవేద్యం వేసి భీమన్న పూజ చేపట్టడం జరుగుతుందని వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి నాయక్ ఫోడ్ కుల బంధువులు, ప్రజలు మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకపోడ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



