నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం మైభాపుర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండలం బిజ్జల్వాడి గ్రామంలో రూ. 29 లక్షల నిధులతో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, త్రాగునీరు వంటి మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించడమే గాక విద్యా వైద్య వ్యవస్థలను మెరుగుపరుస్తానని చెప్పారు. గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) అందజేశారు.
అదేవిధంగా మండలంలోని బిజ్జల్ వాడి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని డిమాలిష్ చేసి నూతన భవనానికి రూ.29 లక్షల మంజూరు చేయించి బుధవారం ఎమ్మెల్యే మండల విద్యాధికారి తిరుపతయ్య, పాఠశాల హెచ్ఎం ఈ. రవికుమార్ , ఉపాధ్యాయురాలు శోభ , స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



