నవతెలంగాణ హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆర్వో కర్ణన్ తెలిపారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తాం. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశాం. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేస్తాం. కౌంటింగ్కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించాం. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తాం’’అని తెలిపారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.



