Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంయూపీలో మరో కుంభకోణం

యూపీలో మరో కుంభకోణం

- Advertisement -

– మృతుల పేర్లతో ‘ఉపాధి’ కార్డులు
– వేతనాలు స్వాహా..విచారణకు ఆదేశం
లక్నో:
బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంభాల్‌ జిల్లాలోని ఒక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో జరిగిన అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాదాపు 20కు పైగా మృతి చెందిన గ్రామస్తుల పేర్లతో ఉపాధి కార్డులను తీసుకుని, వేతనాలు విత్‌ డ్రా తీసుకుంటున్న విషయం వెల్లడయింది. సంభాల్‌ జిల్లాలోని పన్వాస బ్లాక్‌ పరిధిలోఅతరాసి గ్రామంలో ఈ కుంభకోణం బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత గ్రామ అధిపతి సునీతా యాదవ్‌ మరణించిన గ్రామస్తుల పేర్లతో జాబ్‌కార్డులు తీసుకుని, ‘కాగితాలపై పని పూర్తి చేసి’ వేతనాలను విత్‌డ్రా చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, గ్రామపెద్ద సునీతా యాదవ్‌ నుంచి నగదును రికవరీ చేస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కుంభకోణం దాదాపు ఏడు నెలల నుంచి సాగుతున్నట్లు గుర్తించామని, విచారణకు ఆదేశించామని జిల్లా మేజిస్ట్రేట్‌ రాజేంద్ర పెన్సియా విలేకరులకు తెలిపారు. గ్రామంలో జరిగిన ఇతర అభివృద్ధి పనులపై కూడా విచారణ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఒక ఇంటర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కూడా ఉపాధి కార్మికులుగా జాబ్‌ కార్డు పొందిన వారిలో ఉన్నారని చెప్పారు.
దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ రిషిపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ తనకు తెలియకుండానే తన పేరు మీద జాబ్‌ కార్డు తయారు చేసినట్టు చెప్పారు. తాను ఎప్పుడూ ఉపాధి హామీ పథకంలో పనిచేయలేదని తెలిపారు. గ్రామస్తుడు సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘మా తాత జగత్‌ సింగ్‌ 2020లో మరణించారు. అయితే ఆయన పేరు మీద కూడా కార్డు తయారు చేసి, వేతనాలు తీసుకుంటున్నారని ఇప్పటి వరకూ మాకు తెలియదు. గ్రామానికి అధికారులు వచ్చి దర్యాప్తు చేస్తేనే ఈ విషయం మాకు తెలిసింది’ అని అన్నారు. గ్రామాధికారికి చెందిన మరణించిన కొంత మంది బంధువులపై కూడా ఈ విధంగా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. అలాగే, మరణించిన వ్యక్తులతోపాటు, ప్రస్తుతం గ్రామంలో నివాసం ఉండని వారి పేర్లపై కూడా ఉపాధి కార్డులు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -