నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్ఎంపీ వైద్యుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జరుపల సందీప్తి (20) ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్ గత కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను కళాశాలకు పంపకుండా ఇంటి వద్దే ఉంచారు. భయంతో ఆర్ఎంపీ వైద్యుడు పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా తల్లిదండ్రులకు భయపడకుండా తనను పెళ్లి చేసుకోవాలని సందీప్తిని ఆర్ఎంపీ అడగగా ఆమె నిరాకరించింది.
దీంతో ఇద్దరు కలిసి చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను ఆర్ఎంపీ వైద్యుడు నరేశ్ తన స్టేటస్ గా పెట్టుకోవడమే కాకుండా ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి యువతి ఈ నెల 6వ తేదీన కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఆర్ఎంపీపై ఫిర్యాదు చేసింది. ఫొటోలు ప్రచారం చేయడం వల్ల తన, తమ కుటుంబం పరువు పోయిందని భావించి ఈ నెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది.



