నవతెలంగాణ-హైదరాబాద్: భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కి చెందిన విమానం కూలిపోయింది. చెన్నై సమీపంలోని తిరుపోరూర్-నెమ్మిలి రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం యుద్ద విమానం కూలిపోయినట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల ప్రకారం.. సింగిల్ సీటర్ పిలాటస్ పిసి-7 విమానం సాధారణ శిక్షణలో ఉంది. తిరుపొరూర్ సమీపంలోని ఉప్పు కర్మాగారానికి చెందిన కాంపౌండ్ గోడ దగ్గర కూలిపోయింది. విమానం అదుపు తప్పుతోందని గ్రహించిన పైలట్ వెంటనే పారాచూట్ సహాయంతో కిందకు దూకాడు.
మధ్యాహ్నం 2.00గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని స్థానికుడు కె.శివరామన్ తెలిపారు. విమానం కూలిపోయిందని, కానీ పైలెట్ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న ఐఎఎఫ్ సిబ్బంది పైలట్ను ఎయిర్బేస్కు తరలించినట్లు తెలిపారు.ఈ ఘటనపై భారత వైమానిక దళం ఎక్స్లో ఒక పోస్ట్ను విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపింది.



