నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల్లో ఎన్డేయే భారీ మెజార్టీకి కారణం 128 స్థానాల్లో రిగ్గింగ్ జరగడం వల్లేనని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నియోజకవర్గాల్లోనే ఎస్ఐఆర్(SIR) ప్రక్రియ సమయంలో ఈసీ ఓటర్లను తొలగించింది. ఈ నియోజకవర్గాల్లోనే ఓటింగ్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పూర్తి విశ్లేషణతోనే ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టం చేసింది. ఓటర్ల తొలగింపు డేటా, ప్రతి నియోజకవర్గంలోని విక్టరీ మార్జిన్తో పోల్చిన తర్వాతే కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈమేరకు కేరళ కాంగ్రెస్ ఎక్స్లో పోస్టు చసింది.
కాగా, బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఎన్డిఎ గెలిచిన 202 స్థానాల్లో 128 స్థానాలు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు వల్లే గెలిచాయి. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల తొలగింపు డేటాను మేము విశ్లేషించాము. ప్రతి నియోజకవర్గంలోని విక్టరీ మార్జిన్ (గెలుపుకు దగ్గరగా)తో పోల్చాము. అక్కడ జీవించి ఉన్న ఓటర్లను ఎస్ఐఆర్ కింత ఏకపక్షంగా తొలగించారు. ఇది స్పష్టంగా ఉంది అని కేరళ కాంగ్రెస్ ఎక్స్ పోస్టులో పేర్కొంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా కనిపించలేదు. బీహార్లో ఎన్డిఎ పాలనలో బాధలుపడుతున్న పేదలు, అంతకంటే దుర్భర దారిద్య్రంలో ఉన్న ఓటర్లను తొలగించడానికే ఎస్ఐఆర్ పేరుతో మొత్తం ప్రక్షాళన జరిగినట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఎస్ఐఆర్ డేటాలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ల నుండి వచ్చిన అక్రమ వలసల్ని గుర్తించి తొలగించాల్సి ఉంది. కానీ ఎన్నికల సంఘం విడుదల చేసిన మొత్తం డేటాసెట్లో ఆయా దేశాల నుంచి వచ్చిన ఒక్క అక్రమ వలసదారుడి పేరు కూడా లేదు. ఎన్డిఎ పాలనలో పేదల్ని ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు. ఇక మిగిలిన వారిని ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరోధించారు. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ మేనేజ్ చేస్తూ ఓటింగ్ నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే ప్రజస్వామ్యం భారతదేశానికి తల్లి అని అంటుంటారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి తల్లి అంటే అర్థం. ఇప్పుడు గనుక మనం బిజెపి యొక్క ఈ గేమ్ ప్లాన్ అంతరార్థం తెలుసుకోకపోతే బిజెపి సైలెంట్గా మనలో ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితా నుండి తొలగిస్తుంది. మన స్థానంలో డమ్మీ బ్రెజిలియనన్లను చేర్చుతుంది. వారి తరపున ఓట్లు వేస్తూ.. ప్రతి ఎన్నికల్లో ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది అని కాంగ్రెస్ తెలిపింది.



