– బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు
– ఆదివాసి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ
– తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్
నవతెలంగాణ అచ్చంపేట: ఆదివాసి తెగల సాంస్కృతిక ఉద్యమ వీరుడు బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను నల్లమల్ల చెంచుల సహకారంతో ఆదివాసి 9 తెగల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అచ్చంపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై సాంప్రదాయ సాంస్కృతిక దుస్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పటేల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి జెఏసి చైర్మన్ చుంచు రామకృష్ణ, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ లు మాట్లాడారు. ఓటు రాజకీయాలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో నుంచి చట్టబద్ధతలేని లంబాడీలను తొలగించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు చెంచులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ల నుంచి వలస వచ్చి చెంచులతో స్నేహం పెంచుకొని భూములను అక్రమించి దగా చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ జరగకుండా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి వచ్చి, విద్య, ఉద్యోగ, వైద్యం అవకాశాలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న అనేక పేరుగాంచిన యూనివర్సిటీలో ఒక్క చెంచు యువకుడు కూడా అడ్మిషన్ కాలేదు అన్నారు. నల్లమలలో చెంచుల కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ కార్యాలయానికి గత 11 ఏళ్లుగా రెగ్యులర్ ప్రాజెక్టు అధికారిని నియమించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలలో కరెంటు నీరు, వైద్యం, ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఫారెస్ట్ అధికారులు, లంబాడి జాతులు చెంచులను పీల్చుక తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలను ఎస్టీ జాబిత నుంచి తొలగించాలని ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలోని 9 తెగల చెంచులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని పిలుపునిచ్చారు. దేశంలోని 715 తెగలు చెంచు జాతి కోసం మద్దతిస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి హక్కులు చెంచులకు దక్కేవరకు సమ్మక్క సారలక్కల ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. చెంచులు చేస్తున్న ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చెంచు సంఘం నాయకులు చిగుర్ల మల్లికార్జున, కాశి, వెంకటేశ్వర్లు, నిమ్మల శివ, రామారావు, బాల గురువయ్య, సుభద్ర తదితరులు ఉన్నారు.


