పలు వస్తువులపై సుంకాలు తగ్గింపు
వాషింగ్టన్ : అధిక ధరల విషయంలో వినియోగదారుల ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. ఆవు మాంసం, కాఫీ, ఉష్ణమండలాల్లో పెరిగే పండ్లు సహా విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలను తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. ఆవు మాంసం ప్రధాన ఎగుమతిదారుగా బ్రెజిల్ ఉన్నది. అయితే బ్రెజిల్పై భారీ సుంకాలు విధించడంతో ఆవుమాంసం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో దాని ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తాను భావిస్తున్నానని ట్రంప్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. టీ, పండ్లరసం, కోకో, సుగంధ ద్రవ్యాలు, అరటిపండ్లు, నారింజ, టమోటాలు, కొన్ని ఎరువులపై కూడా సుంకాలను తొలగించారు.
ఈక్వెడార్, గ్వాటెమాల, ఎల్సాల్వడార్, అర్జెంటీనా దేశాల్లో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్తత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి రూపొందించిన ఒప్పందాలను ఇటీవల అమెరికా కుదుర్చుకున్నట్టు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాలను విధించారు. దీంతో పలువస్తువుల ధరలు తీవ్రంగా పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆఫ్- ఇయర్ ఎన్నికల్లో ఓటర్లు ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా లేవనెత్తిన సంగతి తెలిసిందే. వర్జీనియా, న్యూజెర్సీల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. దీంతో ట్రంప్ యంత్రాంగం సుంకాల తగ్గింపు చర్యను చేపట్టింది.
వినియోగదారుల ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



