నవతెలంగాణ-హైదరాబాద్ : రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్నాయుడు విచ్చేయనున్నారు. వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాలుపంచుకోనున్నారు.
వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏడుగురు విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, కళ-సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారత, మానవ సేవ, యూత్ ఐకాన్ విభాగాల్లో ఈ సత్కారం ఉంటుంది. ఈ సందర్భంగా ‘రామోజీ నిఘంటువులు’ కూడా విడుదల చేయనున్నారు.



