ఇరాన్ విదేశాంగ మంత్రి
తెహ్రాన్ : ఇరాన్ ఇక నుంచి యురేనియంను శుద్ధి చేయదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగచి ఆదివారం ప్రకటించారు. ఇరాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇరాన్లో వెల్లడించని శుద్ధి చేసిన యురేనియం లేదు. దేశంలో ఉన్న అణుకేంద్రాలు కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నియంత్రణ, పర్యవేక్షణలో ఉన్నాయి’ అని తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ ఏడాది జూన్లో తమ అణుకేంద్రాలపై అమెరికా దాడి తరువాత ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన తొలి ప్రకటనగా భావిస్తున్నారు. అలాగే, ఈ కార్యక్రమంలో అబ్బాస్ అరగచి మాట్లాడుతూ అణు సాంతికేక పరిజ్ఞానాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి, యురేనియంను శుద్ధి చేసుకోవడానికి ఇరాన్కు తిరుగులేని హక్కు ఉందని స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్తో 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణల కారణంగా ఇరాన్ అణుకార్యక్రమం నిలిపివేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఇరాన్తో చర్చలకు సముఖంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ మంత్రి ఖండించారు. అమెరికా ప్రస్తుతం ఇరాన్తో న్యాయమైన చర్చలకు సిద్ధంగా లేదని అన్నారు. ‘ఇంటర్నేషనల్ లా అండర్ అస్సాల్డ్ : అగ్రెషన్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్’ అనే అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్లో ఇజ్రాయిల్తో 12 రోజుల సంఘర్షణలపై ఇరాన్ వైఖరి గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. జూన్లో ముందుగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై ఇజ్రాయిల్ దాడి చేసింది.
తరువాత ఈ నెల చివరిలో ఇరాన్కు చెందిన మూడు కీలక అణుకేంద్రాలు నటంజ్, ఇస్ఫాహన్, ఫోర్డోవోలపై అమెరికా దాడులకు ప్పాలడింది. సెప్టెంబరులో ఇరాన్ సుప్రీం ఖమేని మాట్లాడుతూ అణ్వాయుధ సామర్థ్యం ఉన్నా అణుబాంబును తయారు చేయని ఏకైక దేశం ఇరాన్ అని తెలిపారు. ఏదేమైనా సరే.. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలకు అందోళన ఉంది. ముఖ్యంగా అనుమతించిన పరిమితికి మించి యురేనియంను ఇరాన్ శుద్ధి చేసిందని ఆయా దేశాలు భావిస్తున్నారు. అమెరికా జూన్లో జరిపిన దాడుల్లో 60 శాతం వరకూ శుద్ధి చేసిన యురేనియంను ధ్వంసం చేశారు. అణుబాంబు తయారీ కోసం యురేనియంను 90 శాతం వరకూ శుద్ధి చేయాలి. 2023లో నిర్వహించిన ఐఏఈఏ సర్వేలో 83.7 శాతం వరకూ శుద్ధి చేసిన యురేనియం కణాలను కనుగొన్నారు.
యురేనియం ఇక శుద్ధి చేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



