స్మైల్ డీజిల్ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
నవతెలంగాణ – పరకాల
ప్రయివేటు విద్యాసంస్థల యజమాన్య సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులపై చేస్తున్న వ్యాఖ్యలను బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బీఎస్యూ) తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు విద్యార్థి సంఘాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, తక్షణమే వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని బీఎస్యూ డిమాండ్ చేసింది. హనుమకొండలోని స్మైల్ డీజిల్ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలని బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బీఎస్యూ) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు మడికొండ వరుణ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్ వర్మ వెంటనే విద్యార్థి సంఘ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరిద్దరు చేసే చిన్న పొరపాట్లను సాకుగా చూపి, అన్ని విద్యార్థి సంఘాల నాయకులపై ఆరోపణలు చేయడం, వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. కానీ యజమాన్యాలు “విద్యార్థి సంఘాలకు మాకు ఏం సంబంధం?” అని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అని విమర్శించారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక నానా ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వంపై కేసులను కూడా లెక్కచేయకుండా ఉద్యమాలు చేసింది విద్యార్థి సంఘాల నాయకులేనని వారు గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విద్యార్థి సంఘ నాయకులు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఒక రిలేషన్షిప్ భావజాలాలతో కలిగి ఉండాలి” అని ప్రస్తావించారని గుర్తుచేశారు.
అయినా కూడా ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు దీనికి విరుద్ధంగా విద్యార్థి సంఘ నాయకులపై ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టించడం సరైంది కాదని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.యజమాన్యాలు ఇప్పటికైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఎస్యూ నాయకులు హెచ్చరించారు.



