నవతెలంగాణ-హైదరాబాద్: మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు అధైర్య పడకూడదని, రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఎల్లావేలలా అండగా ఉంటారని అన్నదాతలకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని గుర్తుచేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు పడుతున్న అష్టకష్టాలను ఎలుగెత్తి చాటాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా కేటీఆర్ ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించారు. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బాల్క సుమన్, దివాకర్ రావు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.




