నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై కేరళ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ను వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆదేశించాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఎస్ఐఆర్, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ‘దాదాపు అసాధ్యం’ అని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు ‘గందరగోళ’ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ సమయంలోనే కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది.
డిసెంబర్9-11తేదీల్లో రాష్ట్రంలోని ఎల్ఎస్జిఐలకుఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఇసిఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండూ కూడా ఒకేసారి నిర్వహించడంతో మానవవనరులు దెబ్బతినడమే కాకుండా, ప్రభుత్వ రోజు వారీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొంది. సిబ్బంది కొరత ‘ పాలనా ప్రతిష్టంభన’కు కూడా దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
”ఎస్ఐఆర్ అనే ఎన్నికల సంబంధిత విధుల కోసం ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ సేవల నుండి సుమారు 1,76,000 మంది సిబ్బందిని, మరో 68,000 మంది పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించాల్సిన భారీ ప్రక్రియ. అలాగే ఎస్ఐఆర్ సంక్ష్లిష్టతతో కూడిన గందరగోళ ప్రక్రియ. దీనికోసం 25,668 మంది అదనపు సిబ్బంది సేవలు అవసరం. శిక్షణ పొందిన మరియు అనుభవజ్ఞులైన ఎన్నికల సిబ్బంది పరిమితంగా ఉండటంతో వాటికి ఆటంకం ఏర్పడుతుంది. ఎస్ఐఆర్, ఎల్ఎస్జిఐ ఎన్నికల కోసం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అధికారుల కేటాయింపు దాదాపు అసాధ్యం, పాలనా ప్రతిష్టంభనకు దారితీస్తుంది” అని పిటిషన్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ రాజ్యాంగ బద్ధతకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ వ్యాయామం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేదని తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత సవాలు, ఎస్ఐఆర్ చట్టబద్ధతపై కాదని, నిర్వహిస్తున్న సమయంపై అని పిటిషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది సి.కె.శశి పేర్కొన్నారు. ఎస్ఐఆర్తో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించలేమని పిటిషన్ తెలిపింది. కేరళలో 941గ్రామ పంచాయితీలు, 152 బ్లాక్ పంచాయితీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మునిసిపాలిటీలు మరియు ఆరు కార్పోరేషన్లతో కూడిన 1200 స్థానిక స్వపరిపాలన సంస్థలు (ఎల్ఎస్జిఐ)లు ఉన్నాయి. మొత్తం 23,612వార్డులు ఉన్నాయి.
ఆర్టికల్ 243-ఇ మరియు 243-యు కింద రాజ్యాంగ ఆదేశాన్ని, కేరళ పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 38, కేరళ మునిసిపాలిటీ చట్టంలోని సెక్షన్ 94కింద ఐదు సంవత్సరాలలోపు ఎల్ఎస్జిఐలకు ఎన్నికలు నిర్వహించాలనే చట్టబద్ధమైన ఆదేశాన్ని పిటిషన్ హైలెట్ చేసింది. దీంతో రాష్ట్రంలోని ఎల్ఎస్జిఐలకు ఓటింగ్, లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన సహా ఎన్నికల ప్రకటన ప్రక్రియను రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన ఆదేశాలకు అనుగుణంగా 2025 డిసెంబర్ 21లోపు పూర్తి చేయాలి అని పిటిషన్ పేర్కొంది.



