మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో ‘మన తెలంగాణ గ్రంథాలయాలు’ ఆవిష్కరణ
నవతెలంగాణ-ధూల్ పేట్
వారసత్వ సంపదను పుస్తకీకరించాలని మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం డాక్టర్ రవికుమార్ చేగోని రాసిన ‘మన తెలంగాణ గ్రంథాలయాలు’ పుస్తకాన్ని హైదరాబాద్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో గురువారం సాయంత్రం మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ వారసత్వ సంపదను, గ్రంథాలయాలను కాపాడుకోవాలని మంత్రి అన్నారు. తెలంగాణ గ్రంథాలయ చరిత్ర చాలా గొప్పదని, గ్రంథాలయాలను ఆధునీకరించాలని చెప్పారు. వాటిని పుస్తకీకరించి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. టెక్నాలజీని ఉపయోగిం చుకుని గ్రంథాలయాలలో పాఠకులకనుగుణంగా సేవలందించాలని సూచించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం మహోన్నతమైనదని, గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. దేశంలో 24 గంటలు పని చేసే గ్రంథాలయాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయని వివరించారు.
ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ లాల్బాల్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో గ్రామ గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రయత్నం జరగాలన్నారు. ‘మన తెలంగాణ గ్రంథాలయాలు’ పుస్తకం గ్రంథాలయ ఉద్యమం, గ్రంథాలయ చరిత్రకు దిక్సూచిగా ఉన్నదని చెప్పారు. రచయిత డాక్టర్ రవి కుమార్ చేగోని మాట్లాడుతూ.. గ్రంథాలయ ఉద్యమానికి, గ్రంథాలయాల చరిత్రకు ప్రపంచంలో ప్రత్యేకతను సంతరించుకు న్నదన్నారు. చరిత్రను భవిష్యత్ యువతకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రంథాలయ పరిషత్ చైర్మెన్లు, రాష్ట్ర పౌర గ్రంథాలయాల సంచాలకులు శ్రీహరి, రాష్ట్ర కేంద్ర గ్రంథపాలకులు రాణి, అపర్ణ, కేసరి, ఓయూ లెక్చరర్లు డాక్టర్ లక్పతి, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెక్చరర్ రాజా గౌడ్, దిలీప్, కార్తీక్, మధు, వెంకట్, దివ్య, లావణ్య గ్రంథాలయ శాస్త్ర విద్యార్థిని, విద్యార్థులు, రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వారసత్వ సంపదను పుస్తకీకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



