నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్లో ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని, బీజేపీ ‘గేమ్’ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా బనగావ్ లో మంగళవారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బెంగాల్లో బీజేపీ గేమ్లు చెల్లవని అన్నారు.
‘బిహార్లో ఎన్నికలు జరిగాయి. పాపం..అక్కడి ప్రతిపక్ష నాయకులు బీజేపీ గేమ్ను గ్రహించలేకపోయారు. కానీ మాకు వాళ్ల గేమ్లు ఏమిటో బాగా తెలుసు. వాళ్ల ఆటలు బెంగాల్లో ఎంతమాత్రం సాగవు. బెంగాల్ను టచ్ చేయాలని చూస్తే మేము యావద్దేశాన్ని కుదిపేస్తాం’ అని సీఎం తీవ్ర స్వరంతో అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బంగ్లాదేశీ హిందువులకు సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారని, ఎస్ఐఆర్ కారణంగా 35 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లను సృష్టించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నారని, ఇది బీజేపీ ప్లాన్ అని ఆరోపించారు.



