నవతెలంగాణ – హైదరాబాద్: హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి చెందిన ‘దస్తకర్ హైదరాబాద్ బజార్’ ఎక్స్పోను అమీర్పేట రోడ్డులో ఉన్న కమ్మ సంఘం హాల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం ప్రారంభించారు. ఈ ఎక్స్పో డిసెంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. దస్తకర్ తన 5వ హైదరాబాద్ హ్యాండ్స్ అండ్ కల్చర్ వేడుకకు సాదర స్వాగతం పలుకుతుంది. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ దస్తకర్ 1981లో ప్రారంభమైందన్నారు. అప్పట్లో భారతదేశంలో హస్తకళలకు ఆదరణ లేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో హస్తకళలకు ఆదరణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దస్తకర్ ను ఏర్పాటు చేశారన్నారు. చేనేత కళాకారులను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా దస్తకర్ ప్రతినిధి షెల్లీ జైన్ మాట్లాడుతూ ఈ ఎక్స్పోలో 75 పైగా స్టాల్స్ కలవన్నారు. నాలుగు దశాబ్దాలుగా హస్తకళాకారుల సేవలో ఉన్నామన్నారు. ఈ ఎక్స్పోలో పూర్తిగా చేతితో తయారు చేసిన వస్తువులు మాత్రమే ఉన్నాయన్నారు. చేనేత వస్త్రాలు, కుండలు, తోలు పాదరక్షలు, ఆభరణాలు, ఎంబ్రాయిడరీ ఉన్నాయని తెలిపారు.



