నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ గాజాలో పాలస్తీనియన్లపై ఇప్పటికీ మారణహోమానికి పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇజ్రాయిల్ గాజాలో ఇప్పటికీ మారణహోమం కొనసాగిస్తోందని పేర్కొంది. ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో సున్నితమైన కాల్పుల విరమణ రెండేళ్ల యుద్ధం తర్వాత అక్టోబర్ 10నుండి అమల్లోకి వచ్చింది.
”కాల్పుల విరమణ గాజాలో జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందనే ప్రమాదకరమైన భ్రమను సృష్టించే అవకాశం ఉంది ” అని ఆమ్నెస్టీ చీఫ్ ఆగెస్ కల్లామర్డ్ పేర్కొన్నారు. ” ఇజ్రాయిల్ ప్రభుత్వం, సైన్యం తమ దాడుల స్థాయిని తగ్గించి, గాజాలోకి పరిమిత మొత్తంలో మానవతా సాయాన్ని అనుమతించినప్పటికీ.. ప్రపంచం మోసపోకూడదు. ఇజ్రాయిల్ మారణహోమం ముగియలేదు ” అని అన్నారు.
దేశాన్ని, జాతిని, జాతిసంబంధమైన లేదా మతపరమైన సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసే ఐదు చర్యలలో ఏచర్యనైనా ‘మారణహోమం’గానే పరిగణించాలని 1948 ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. గాజాలోని పాలస్తీనియన్ల భౌతిక విధ్వంసానికి దారితీసేలా ఉద్దేశపూర్వకంగా జీవన పరిస్థితులపై ఆంక్షలు విధించడం సహా .. మూడు చర్యల ద్వారా ఇజ్రాయిల్ గాజాలో మారణహోమానికి పాల్పడుతోందని 2024 డిసెంబర్లో, ఆమ్నెస్టీ తేల్చింది.
గురువారం ఈ నివేదికను నవీకరిస్తూ ఈ విధంగా వెల్లడించింది. ”పౌర జనాభా మనుగడకు అవసరమైన సామాగ్రి మరియు సేవల పునరుద్ధరణపై ఇజ్రాయిల్ ఆంక్షలు విధిస్తూనే ఉంది. దాడుల స్థాయి తగ్గినప్పటికీ, కొన్ని పరిమిత మెరుగుదలలు ఉన్నప్పటికీ, గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ అమలు జరుపుతున్న విధానాల్లో అర్థవంతమైన మార్పు లేదు మరియు ఇజ్రాయిల్ ఉద్దేశ్యం మారిందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు”. ”గాజాలో ఇజ్రాయిల్ ప్రవర్తనా విధానం, పాలస్తీనియన్ల ప్రాణాలను రక్షించే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా, చట్టవిరుద్ధంగా తిరస్కరించడం సహా వీరిలో చాలా మంది గాయపడ్డారు, పోషకాహార లోపంతో ఉన్నారు. మరియు తీవ్రమైన వ్యాధుల ప్రమాదంలో ఉన్నారు. వారి మనుగడకు ముప్పు కలిగిస్తూనే ఉన్నారు” అని కల్లామర్డ్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2025లో, ఐక్యరాజ్యసమితి ఏఏర్పాటు చేసిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ”గాజాలో మారణహోమం జరుగుతోందని అని తేల్చింది. 1948 మారణహోమం జాబితా చేసిన ”అక్టోబర్ 2023 నుండి ఇజ్రాయిల్ ప్రభుత్వం, దళాలు ‘ఐదు జాతి విధ్వంసక చర్యల్లో నాలుగు” చర్యలకు పాల్పడ్డారు” అని దర్యాప్తు తేల్చింది.



