Tuesday, December 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఐదేండ్ల జైలుశిక్ష

బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఐదేండ్ల జైలుశిక్ష

- Advertisement -

అవినీతి కేసులో ఢాకా కోర్టు ఉత్తర్వులు

ఢాకా : అవినీతి ఆరోపణలపై బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐదేండ్ల జైలు శిక్షను విధిస్తూ ఢాకా కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాని సోదరి షేక్‌ రెహనాకు కూడా ఈ కేసులో ఏడేండ్ల శిక్షను విధించారు. రెహనా కుమార్తె, బ్రిటీష్‌ ఎంపీ తులిప్‌ సిద్ధికి కి రెండేండ్లు శిక్ష పడింది. ఢాకాలోని పూర్వాచల్‌ ఏరియాలో ప్రభుత్వ ప్లాట్‌ల అక్రమ కేటాయింపు కేసులో ఢాకా ప్రత్యేక న్యాయమూర్తి-4 రబీల్‌ ఆలం ఈ తీర్పు వెలువరించారు. గతేడాది నమోదైన ఈ కేసులో మొత్తంగా షేక్‌ హసీనాపై ఆమె కుటుంబ సభ్యులపై వేర్వేరుగా ఆరు కేసులను బంగ్లాదేశ్‌ అవినీతి నిరోధక కమిషన్‌ (ఏసీసీ) నమోదు చేసింది. కాగా, అంతకుముందు అవినీతి కేసులో హసీనాకు 21ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం ఢాకా కోర్టు మరో ఉత్తర్వు వెలువరించింది.

మూడు ప్లాట్‌లకు సంబంధించిన అవినీతి, అక్రమాల కేసుల్లో ఒక్కోదానికి ఏడేళ్లుచొప్పున శిక్ష పడింది. ఆ మిగిలిన మూడు కేసుల్లో తీర్పు సోమవారం వెలువడింది. షేక్‌ హసీనా కుమారుడు సాజిబ్‌ వజీద్‌కు ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష టాకాల జరిమానా విధించారు. కుమార్తె సైమా వజీద్‌ పుతుల్‌కు ఐదేండ్లు శిక్ష పడింది. గతేడాది ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు,అల్లర్లను అమానుషంగా అణచివేసిన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ ఇప్పటికే షేక్‌ హసీనాకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసుల్లో వీరందరూ పరారీలో వుండడంతో వీరి తరపు న్యాయవాది ఎవరూ వాదనలు వినిపించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -