Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయం14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి

14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి

- Advertisement -

అల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు
న్యూఢిల్లీ : ఉగ్రవాద సంబంధిత మనీ లాండరింగ్‌ కేసులో అల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్‌ అహ్మద్‌ సిద్దిఖీకి ఢిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. నవంబర్‌ 19న 13రోజుల పాటు ఇడి కస్టడీకి సిద్దిఖీని తరలించిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయనను అదనపు సెషన్స్‌ జడ్జి శీతల్‌ చౌదరి ప్రధాన్‌ ఎదుట హాజరు పరచగా, డిసెంబర్‌ 15 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంటకు ఇడి కస్టడీ ముగియనుందని, అందుకే సోమవారం కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు ఇడి న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ సమయంలో సూచించిన మందులు, కళ్లజోడులను అందించాలని కోరుతూ సిద్దిఖీ తరపు న్యాయవాది కోరగా ఈ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. సిద్దిఖీ వైద్య ప్రిస్కిప్షన్‌ను ఇడి అధికారులు కోర్టుకు అందించారు.

కోర్టు అతనికి సూచించిన చికిత్సను కొనసాగించేలా చూడాలని జైలు అధికారులను ఆదేశించింది. అలా ఫలాహ్‌ యూనివర్శిటీ యుజిసి గుర్తింపు గురించి తప్పుగా క్లెయిమ్‌ చేసిందని, ఎన్‌ఎఎసి అక్రిడేషన్‌పై కూడా విద్యార్థులకు తప్పుగా చూపించిందని ఇడి గతంలో పేర్కొంది. 2018 -2025 మధ్య ఈ సంస్థ రూ.415.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఆస్తుల రికార్డులతో సరిపోలినప్పటికీ.. ఆస్తుల్లో ఒకేసారి పెరుగుదల కనిపించిందని పేర్కొంది. విద్యార్థుల ఫీజులు, ప్రజల నుండి సేకరించిన నిధులను వ్యక్తిగత, ప్రైవేట్‌ అవసరాలకు మళ్లిస్తున్నారని, అలా ఫలాహ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, మేనేజింగ్‌ ట్రస్ట్‌ మరియు సంబంధిత సంస్థలపై సిద్దిఖీ వాస్తవ నియంత్రణను కలిగి ఉన్నారని ఇడి కోర్టుకు తెలిపింది. ఆయన అరెస్టు జరిగిన రోజున ఢిల్లీలోని 19 ప్రదేశాల్లో జరిపిన సోదాల్లో దాదాపుగా రూ.48లక్షల నగదు లభించిందని ఇడి అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 15న సిద్దిఖీ జ్యుడీషియల్‌ కస్టడీ ముగిసిన తర్వాత ఈ అంశం విచారణకు రానుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -