రాజ్భవన్ పేరు లోక్భవన్గా మార్పు
తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) ఇకనుంచి సేవాతీర్థ్గా పిలవనుంది. దశాబ్దాలుగా సౌత్బ్లాక్లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా ఆ కార్యాలయం ప్రస్తుతం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే రాజ్భవన్ పేరుతో కొనసాగుతోన్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇకపై ‘లోక్భవన్’గా మార్చాలని కేంద్రం ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్భవన్గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి.
వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న ఈ పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్టు సమాచారం. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్లోకి మార్చనున్నారు. వాయుభవన్కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్-1లో ఒక భవనాన్ని సేవాతీర్థ్-1గా పిలవనున్నారు. దానిలో పీఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు భవనాలు సేవాతీర్థ్-2, సేవాతీర్థ్-3 నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పని చేయనున్నాయి. ఇప్పటికే ఎన్క్లేవ్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాజ్భవన్… ఇక లోక్భవన్
తెలంగాణ రాజ్భవన్ పేరు మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్భవన్ను లోక్భవన్గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



