15 మందికి అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – గద్వాల డెస్క్
ఫుడ్ పాయిజన్ అయ్యి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గద్వాల జిల్లా కేంద్రం బీమ్నగర్లోని ఎస్టీ హాస్టల్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఎస్టీ హాస్టల్లో 128 మంది విద్యార్థులున్నారు. మంగళవారం ఉదయం అల్పాహారం, అరటి పండ్లు, బిస్కెట్లు తిన్న తర్వాత విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. అరగంట అనంతరం 15మంది విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని పలువురు విద్యార్థులు తెలిపారు. కొద్దిసేపటికి కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయన్నారు. దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను వెంటనే గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.



