హిల్ట్ పాలసీతో నిజనిర్ధారణ కోసం క్షేత్రస్థాయికి
నేడు, రేపు పారిశ్రామికవాడల్లో పర్యటనకు 8 బృందాల ఏర్పాటు
నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మహానగర పరిధిలో రూ.ఐదు లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను, ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’ (హిల్ట్) పేరుతో చేసే భూకుంభకోణంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పోరుబాటకు సిద్ధమైంది. ఆ పాలసీ వల్ల ప్రజలకు కలిగే నష్టంపై నిజనిర్ధారణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించింది. పారిశ్రామికవాడల్లో పర్యటించడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన ‘నిజనిర్ధారణ బృందాలను’ ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ.ఐదు లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రూ.వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు.
నేడు, రేపు పారిశ్రామిక వాడల్లో బృందాల పర్యటన
ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు బుధ, గురువారాల్లో పర్యటించనున్నాయని కేటీఆర్ వివరించారు. అక్కడ స్థానిక నాయకులు, ప్రజలను కలుపుకుని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచుతారని చెప్పారు. క్లస్టర్-1లో మాజీమంత్రి హరీశ్రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారని అన్నారు. క్లస్టర్-2లో మాజీమంత్రి జగదీశ్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారని వివరించారు. క్లస్టర్-3లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్రెడ్డి, రవీందర్రావులు మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను సందర్శిస్తారని చెప్పారు.
క్లస్టర్-4లో తనతోపాటు సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నవీన్ రావులు సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాలను పరిశీలిస్తారని చెప్పారు. క్లస్టర్-6లో మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు కలిసి మేడ్చల్ ఇండిస్టియల్ పార్కుకు వెళ్తారని అన్నారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, కార్తీక్రెడ్డి కలిసి కాటేదాన్, హయత్నగర్లో పర్యటిస్తారని వివరించారు. క్లస్టర్-8లో మాజీమంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీం, చందులాల్ కలిసి బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారని చెప్పారు.



