– సుప్రీంకోర్టులో తమిళనాడు
న్యూఢిల్లీ : కరూర్ తొక్కిసలాట కేసు విచారణను సీబీఐకు అప్పగించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును మంగళవారం కోరింది. రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు విచారణను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి, లేదా రాష్ట్ర పోలీసులను అనుమానించడానికి ఒక్క కారణం లేదని తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో సినీనటుడు, టీవీకే అధ్యక్షులు విజరు రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్యాప్తు బృందాన్ని సిట్ను రద్దు చేయాలని, సీబీఐ చేత ఈ కేసు విచారణను జరిపించాలని టీవీకే జనరల్ సెక్రెటరీ ఆదవ్ అర్జున, బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు జిఎస్ మణి, మరికొంతమంది స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఈ కేసును విచారణను సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆదవ్ అర్జున, ఇతరులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నిజానికి విచారణకు అర్హమైదని కాదనీ, ఇందులో అన్ని ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయని విమర్శించింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సక్రమంగా కొనసాగుతోందని, ఎలాంటి దురుద్దేశాలు, పక్షపాతాలు లేవని అఫిడవిట్లో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
కరూర్ తొక్కిసలాట కేసు సీబీఐ విచారణను రద్దు చేయండి
- Advertisement -
- Advertisement -



