Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి, ఉద్యోగాలకు ఊతం

ఉపాధి, ఉద్యోగాలకు ఊతం

- Advertisement -

మేనేజ్‌మెంట్‌ విద్యలో అగ్రగామి ఐపీఈ
బోధన, పరిశోధన, శిక్షణ, కన్సల్టింగ్‌ లక్ష్యంగా ముందుకు..
50 వర్సిటీలతో ఎంఓయూలు
ఉచితంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌
దేశంలో 10 వేల మంది ఫ్యాకల్టీకి నాణ్యమైన శిక్షణ : ఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.శ్రీనివాస మూర్తి

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్‌ విద్యకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఆకర్షించేందుకు ఎన్నో విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వాటికంటే భిన్నంగా నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను విద్యార్థులకు అందించడంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఐపీఈ) ముందంజలో ఉంది. హైదరాబాద్‌ నగర శివారులోని శామీర్‌పేటలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాసంస్థ నెలకొల్పబడింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని అర్హతలు, అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో విద్యను అందిస్తూ, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ రూపకల్పన చేస్తున్నామని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాస మూర్తి తెలిపారు.

”వికసిత్‌ భారత్‌-2047” లక్ష్య సాధన దిశగా ఐపీఈ అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. ”ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు కొదవ లేదు.. అది కూడా ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లతో ఉంటుంది” అని.. శ్రీనివాసమూర్తి ‘నవతెలంగాణ’తో అన్నారు. ఆయన మాటల్లోనే..”ఐపీఈ సంస్థ విద్యార్థులను కేవలం ఉద్యోగులుగానే కాక సమాజానికి ఉపయుక్తమైన పౌరులుగా తీర్చిదిదు ్దతున్నాం. బోధన, పరిశోధన, శిక్షణ, కన్సల్టింగ్‌ రంగాల్లో ఐపీఈ నిరంతరం కృషి చేస్తోంది. ఎందరో నిష్ణాతులైన విద్యార్థులను ప్రపంచానికి అందిస్తూ.. ఇంకొందరిని ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది..” అని అన్నారు.

మార్పులను అందిపుచ్చుకుంటూ..
ఐపీఈ 1964లో స్థాపించినప్పటి నుంచి సమాజ నిర్మాణానికి, శ్రేయస్సుకు, విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడుతూ వస్తోంది. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని దానికి అనుగుణంగానే రూపాంతరం చెందుతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ నుంచి సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ గుర్తింపు పొందింది. ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ప్రోత్సహించింది. నిధులు భారీగా అందించింది.

అలరించే కోర్సులు
ఐపీఈ 2 ఏండ్ల వ్యవధి కలిగి ఉన్న 6 ఫుల్‌టైమ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. వీటిలో పీజీడియం, పీజీడీఎం/ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పీజీడీఎం/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, పీజీడీఎం-మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, పీజీడీఎం హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, పీజీడీఎం-బిజినెస్‌ ఎనలాటిక్స్‌ కోర్సులను అందిస్తోంది. ఐపీఈ ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీహెచ్‌డీ ప్రోగ్రాం) అందిస్తోంది.

అందుబాటులో 40వేల పుస్తకాలు
ఐపీఈ అకాడమిక్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌, ఆధునిక నాలెడ్జి సెంట్రల్‌ లైబ్రరీ కలిగి ఉంది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌, 40,000 పుస్తకాలు, విద్యార్థులకు ఉపయోగకరమైన ఎలక్ట్రానిక్స్‌ డేటా బేసెస్‌ ఉన్నాయి. ఆడిటోరియం, ఇండోర్‌, ఔట్‌ డోర్‌ క్రీడా స్థలాలు ఉన్నాయి. క్యాంపస్‌లో విద్యార్థినులు, విద్యార్థులు వేర్వేరుగా ఉండేం దుకు ఆధునిక హాస్టల్స్‌ సౌకర్యాలున్నాయి. బోర్డు గవర్నర్లకు ప్రెసిడెంట్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు ఉన్నారు.

భారీగా ప్లేస్‌మెంట్స్‌
ఇక్కడ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే 95 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందుతారు. ఉత్తమ ప్యాకేజి కోసం డ్యూయల్‌ స్పెషలైజేషన్‌తో మెత్తం 8 స్పెషలైజేషన్స్‌తో ఇక్కడ ప్రతి విద్యార్థీ రెండు అంశాల్లో నిష్ణాతులై ఉండేలా తయారు చేస్తున్నామని డెరైక్టర్‌ ప్రొ.శ్రీనివాసమూర్తి తెలిపారు. నిత్యం ఇక్కడికి వచ్చే కంపెనీలు, పరిశ్రమల సంఖ్య మరింతగా పెరగడంతోపాటు డెలాయిట్‌ కంపెనీనే సుమారు 100మందికి పైగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుం టోందని తెలిపారు. అలాగే పీడబ్ల్యూసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్‌ బ్యాంక్‌, మెట్రిక్‌ అనలిటిక్స్‌, గ్లోబల్‌ డేటా వంటి ప్రముఖ సంస్థలు ప్రతి సంవత్సరం విద్యార్థులను అధిక వేతన ప్యాకేజీలతో నియమిం చుకుంటున్నాయని చెప్పారు.

50 వర్సిటీలతో ఒప్పందం
ఐపీఈ దేశవ్యాప్తంగా 50 యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉచిత ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు 10 వేల మంది ఫ్యాకల్టీకి నాణ్యమైన శిక్షణ అందించిన ఘనత సంస్థకు దక్కింది. ఎస్‌ఏక్యూఎస్‌ అక్రిడిటేషన్‌ కలిగిన ఐపీఈ డిగ్రీలకు సార్క్‌ దేశాల్లో గుర్తింపు ఉంది. నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా లాంటి దేశాల్లో మేనేజ్‌మెంట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు డెరైక్టర్‌ తెలిపారు.

పరిశ్రమల అవసరానికి తగ్గట్టుగా..
పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని ఐపీఈలో కోర్సులకు రూపకల్పన జరుగుతోంది. ఏఐ, లీడర్‌షిప్‌, రీసెర్చ్‌ మెథడాలజీ వంటి అంశాల్లో శిక్షణ ఉంటోంది. విద్యార్థులు ప్రతిభతో కార్పొరేట్‌ రంగంలో రాణించడమే కాకుండా, సామాజిక బాధ్యతను విస్మరించకుండా, వారిని ఆ రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేస్తోంది. ఇక్కడ రెండేండ్లలో విద్యార్థులు, అనేక స్టూడెంట్స్‌ క్లబ్స్‌ (ఉదాహరణకు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ క్లబ్‌, యచ్‌ ఆర్‌ క్లబ్‌, ఆపరేషన్‌ క్లబ్‌) ద్వారా అనేక అంశాలు నేర్చుకుంటారు. ఐపీఈలో ప్రధానంగా బోధన, శిక్షణ, కన్సల్టింగ్‌, పరిశోధన అనే నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు ఈ 4 అంశాల్లో పట్టు సాధిస్తునారని డెరైక్టర్‌ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -