నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో అతను ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. “విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు విరాట్ కోహ్లీ తన అంగీకారాన్ని మాకు తెలియజేశాడు” అని రోహన్ జైట్లీ ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రాక, దేశవాళీ టోర్నీలలో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ జట్టుకు పెద్ద ఊరటనివ్వనుంది.
విరాట్ కోహ్లీ దశాబ్దానికి పైగా విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండటం విశేషం. చివరిసారిగా 2008-2010 మధ్య కాలంలో అతను ఈ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో 13 మ్యాచ్లలో 68.25 సగటుతో 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో కలిపి 819 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్, త్రిపుర వంటి జట్ల చేతిలో కూడా ఓటమి పాలైన ఢిల్లీకి కోహ్లీ అనుభవం, నాయకత్వ పటిమ ఎంతో మేలు చేయనుంది. ప్రస్తుతం కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేల్లోనే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అతని చేరిక ఢిల్లీ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపనుంది.



