నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
నవతెలంగాణ – పెబ్బేరు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కావలసిన ధ్రువపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం ఉదయం మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపన గండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కావలసిన ధ్రువపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.
సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గానీ పోటీ చేయు అభ్యర్థికి ప్రతిపాదించే వ్యక్తి ఏ కులం వారైనా అయ్యుండొచ్చని అందులో సందేహం అవసరం లేదని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్, మరొకరు లేదా ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు.ఆయా మండలాలు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.



