నవతెలంగాణ – హైదరాబాద్: భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మోహిత్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. “ఈ రోజు, మనస్ఫూర్తిగా నేను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి భారత జెర్సీ ధరించడం, ఐపీఎల్లో ఆడటం వరకు ఈ ప్రయాణం ఒక వరం లాంటిది” అని పేర్కొన్నాడు.
ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహచర ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మోహిత్ కృతజ్ఞతలు తెలియజేశాడు. 2011లో హర్యానా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రంతో ప్రారంభమైన మోహిత్ కెరీర్ దాదాపు 14 సంవత్సరాలు కొనసాగింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2013 నుంచి 2015 మధ్య భారత్ తరఫున 26 వన్డేలు, ఎనిమిది టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో 37 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ గాయపడటంతో 2015లో ప్రపంచ కప్లో మోహిత్ శర్మకు అవకాశం లభించింది. ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లలో 13 వికెట్లు పడగొట్టాడు. 2014లో టీ20 ప్రపంచ కప్లోనూ ఆయన ఆడాడు.



