ఏడాదిలోగా పనులు ప్రారంభిస్తాం
వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం
ఐబీ స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవ సభ
హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, పరిశ్రమలు వస్తాయని జిల్లా అభివృద్ధికి చెందుతుందని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద స్వామి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించారు.
సంవత్సరం లోగా ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తాం
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేద ప్రజల ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలో హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షాలను సైతం కలుపుకుని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 700 ఎకరాలలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో భూసేకరణకు జీవో జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ కొరకు భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించిందని, సంవత్సరం లోగా ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ పనులను ప్రారంభించి ఎయిర్ బస్సులను నడిపిస్తామని తెలిపారు.
అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తాం
ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని, కొమురం భీమ్, రాంజీ గోండు స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాబోవు 2 నెలలలో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులను, ప్రజా ప్రతినిధులను ఒకచోట చేర్చి నివేదికలు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆదిలాబాద్ కు సాగు నీటిని అందిస్తాం
గతంలో తుమ్మిడిహెట్టి నుండి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 38 వేల 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా కొరకు టెండర్లు పిలవడం జరిగిందని, వ్యవసాయ భూములకు గోదావరి నీటి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆనాటి నిర్లక్ష్యన్ని సరిదిద్ది ఆదిలాబాద్ ప్రజలకు సాగు నీటిని అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
సీసీఐ పునఃప్రారంభానికి కృషి
ఆదిలాబాద్ ప్రాంతంలోని అపారమైన సున్నపు గనులను వినియోగించుకుని సిమెంటు కర్మాగారాలను నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం
ఖమ్మంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఉమ్మడి ఆదిలాబాద్ లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. దాని కోసం స్థల సేకరణ చేయాలని జిల్లాలోని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు తల ఒక చోటు పేరు చెబుతున్నారని.. తనకైతే ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉందని తెలిపారు. యూనివర్సిటీకి గొండు వీరుడు కొమురం భీమ్ పేరు పెడితే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి భర్తీ చేసేందుకు కృషి చేసి 61 వేల మంది నిరుద్యోగులకు ఎల్.బి. స్టేడియంలో ప్రజల సాక్షిగా నియామక పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహించి 562 మంది గ్రూప్ 1 అధికారులను నియమించామని, గ్రూప్ 2లో 785 మందికి, పోలీస్, వైద్య శాఖ తో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలు కల్పించి తెలంగాణ పునర్నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేయడం జరిగిందని తెలిపారు. రాబోవు రోజులలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని, తెలంగాణ యువత అధికారులుగా, ఉద్యోగులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో నిరుద్యోగులు తిరగకుండా బుద్దిగా చదువుకోవాలని తెలిపారు.
మార్చ్ లో అడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి 2 సంవత్సరాల కాలంలో 8 వేల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలను 1 వేయి బస్సులకు యజమానులను చేసామని, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలోని ఆడబిడ్డలను అన్ని వ్యాపార రంగాలలో ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు చీర సారె పెట్టే తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను అందించడం జరిగిందని, మార్చి-2026 నెలలో మున్సిపాలిటీలలోని మహిళలకు అందించడం జరుగుతుందని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తామని, కుటుంబ మర్యాదను నిలబెట్టే విధంగా ఆడబిడ్డలను ఇంటి యజమానులను చేశామని తెలిపారు.
సన్నరకం వడ్లకు మద్దతు ధరతో బోనస్
దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడిందని, రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించడం జరుగుతుందని, రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని తెలిపారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా అదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, కలెక్టరేట్ భవన సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్, పోలీస్ గృహ సముదాయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం పట్టణ మహిళా సమాఖ్య – 160 స్వయం సహాయక సంఘాలకు 19 కోట్ల 69 లక్షల 33 వేల రూపాయల బ్యాంకు రుణం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పూర్ణ చందర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




