ట్రోఫీని ఆవిష్కరించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వి.చాముండేశ్వర్నాథ్
జర్నలిస్టులకు మైదానంలో క్రికెటర్లు పడే కష్టాలు ఇప్పుడు తెలుస్తాయని చమత్కారం
ఉత్తమ ప్లేయర్కు ఎంఎల్ఆర్ ఈవీ స్కూటర్ను బహుమతిగా ఇస్తామని ప్రకటన
హైదరాబాద్ : నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) సీజన్-02 ట్రోఫీను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్నాథ్, ఎన్ఈసీసీ బిజెనెస్ ఏజీఎం సంజీవ్ చింతావర్ ఆవిష్కరించారు. గురువారం ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో జేపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ సందడిగా జరిగింది. అనంతరం రన్నరప్ ట్రోఫీని స్పోర్టీఓ మేనేజింగ్ డైరెక్టర్ సి.భరత్ రెడ్డి, మ్యాచ్ అవార్డ్స్ను ఇండీ రేసింగ్ యజమాని కె.అభిషేక్ రెడ్డి, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చాముండేశ్వర్ నాథ్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఇలా ఒక వేదిక పైకి వచ్చి లీగ్లో ఆడతుండడం అభినందనీయమని అన్నారు. మీడియా సంస్థలన్నింటిని కలిపి జేపీఎల్ను నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్)ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెటర్ల ఆటతీరు, మ్యాచ్ ఫలితాలపై తమదైన శైలిలో విశ్లేషణలు చేసే జర్నలిస్టులకు ఇప్పడు ఆటగాళ్ల కష్టాలు, వారు పడే శ్రమ ఈ జేపీఎల్ ద్వారా అర్ధమవుతుందని చాముండేశ్వర్ నాథ్ చమత్కరించారు. ఈ టోర్నీలో ఉత్తమ ప్లేయర్గా నిలిచిన వారికి ఎంఎల్ఆర్ మోటర్స్ నుంచి రూ.1 లక్ష 25 వేలు ఖరీదు గల ఈవీ స్కూటర్ను బహుమతిగా ప్రదానం చేయనున్నానని ప్రకటించారు.
7 నుంచి మ్యాచ్లు:
ఈనెల 7వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ టీ20 టోర్నమెంట్ జరగనుంది. మొత్తం పది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో స్పోర్టీవో మేనేజింగ్ డైరెక్టర్ సి.భరత్ రెడ్డి, ఇండీ రేసింగ్ యజమాని కె.అభిషేక్ రెడ్డి, జుపర్ ఎల్ ఈడీ సంస్థ డైరెక్టర్ ఒరుసు రమేష్, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.



