Friday, December 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతొలిదశలో 395 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

తొలిదశలో 395 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

- Advertisement -

అత్యధికంగా వికారాబాద్‌లో 39, అత్యల్పంగా వనపర్తిలో 5
9,331 వార్డు స్థానాలు ఏకగ్రీవం
అత్యధికంగా ఆదిలాబాద్‌లో 953, అత్యల్పంగా వికారాబాద్‌లో 652
తుది లెక్కల ప్రకారం 13,127 మంది బరిలో
3,836 పంచాయతీ స్థానాల్లో ఎన్నికలు
డిసెంబర్‌ 11న ఓటింగ్‌, అదే రోజు లెక్కింపు, ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 189 మండలాల్లోని 4,236 పంచాయతీలు, 37,440 వార్డులకు మొదటి దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తుది వివరాలను ఎన్నికల సంఘం అధికారులు గురువారం వెల్లడించారు. అత్యధికంగా వికారాబాద్‌లో 39, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 33, నిజామాబాద్‌లో 29 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యల్పంగా హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లిలో 4 చొప్పున, ఆ తర్వాత వనపర్తిలో 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వార్డుల వారీగా మొదటి దశలో మొత్తం 37,440 వార్డుల్లో 9,331 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 953, ఆ తర్వాత వికారాబాద్‌లో 652, కొమురం భీం అసీఫాబాద్‌లో 576, అత్యల్పంగా జోగులాంబ గద్వాలలో 79, ఆ తర్వాత వనపర్తిలో 104, సంగారెడ్డిలో 113 వార్డులు ఏకగ్రీవమై నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో మొత్తం 4,236 పంచాయతీల్లో 395 ఏకగ్రీవం కాగా 3,836 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తుది లెక్కల ప్రకారం 8,095 మంది సర్పంచ్‌ పదవికి వేసిన నామినేషన్లను ఉప సంహరించుకోగా, 13,127 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అలాగే మొత్తం 37,440 వార్డుల్లో 9,626 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 67,893 బరిలో నిలిచారు. సర్పంచ్‌ పదవి కోసం ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున, వార్డులకు ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున సగటున పోటీలో ఉన్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్‌ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయించారు. ఇద్దరు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేరు, వృత్తిని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్‌ అధికారి గుర్తును కేటాయించారు. డిసెంబర్‌ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. నేటితో రెండో విడుత నామినేషన్ల అప్పీళ్లతో పాటు మూడో విడుత నామినేషన్లకు గడువు ముగియనుంది.

5గ్రామాలు, 149 వార్డులు.. ఎన్నికలకు దూరం ఒక్క నామినేషన్‌ దాఖలు కాని వైనం
రాష్ట్రంలో తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న 4,236 పంచాయతీల్లో 5 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 3, ఆసీఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో ఒక్కో గ్రామంలో పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. అలాగే 37,440 వార్డులకు గాను 149 వార్డులో కూడా ఎవరూ పోటీకి ఆసక్తి చూపక పోవడంతో ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదని ఈసీ తెలిపింది. అత్యధికంగా కుమురంభీం ఆసీపాబాద్‌ జిల్లాలో 41 వార్డుల్లో, ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో34 వార్డుల్లో నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -