నవతెలంగాణ-హైదరాబాద్: ఎయిర్లైన్ సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది . నేడు కూడా దాదాపు 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో నెలకొన్న ఈ సంక్షోభంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎప్పటిలాగే జాప్యాలు, రద్దులు, నిస్సహాయతకు మూల్యం చెల్లించేది సాధారణ పౌరులే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇండిగో విమానాల రద్దు, అంతరాయాల కారణంగా దేశంలో విమానయాన రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇండిగో వైఫల్యానికి ఈ ప్రభుత్వ గుత్తాధిపత్యమే ప్రధాన కారణం. ఎప్పటిలాగే జాప్యాలు, రద్దులు, నిస్సహాయతకు మూల్యం చెల్లించేది సాధారణ పౌరులే. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలి. మ్యాచ్ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదు’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.



