నవతెలంగాణ-హైదరాబాద్: యూపీలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా పురోగతిని బహిరంగపరచాలని, బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) ప్రాణాంతక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలని సమాజ్వాది పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఎల్ఓలపై అధిక పని భారం పడకుండా ఉండటానికి అదనంగా అధికార సిబ్బందిని నియమించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
కాగా, రాష్ట్రంలో పూర్తయిన ఎస్ఐఆర్ పనుల శాతాన్ని వెంటనే ప్రచురించాలి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఏపాటిదో ఊహించినదే. దానిపై చర్చ కూడా అనవసరం. అధికారంలో ఉన్నవారు లేదా వారి సహచరులు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో దొడ్డిదారిన పాల్గొనకుండా చూడాలి అని ఇసిని కోరారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పిడిఎ (పిచ్డా, దళిత్ అల్ప సంఖ్యక్) వర్గాలకు చెందిన పేర్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అఖిలేష్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
ఎస్ఐఆర్పై కన్నౌజ్కు చెందిన ఎమ్మెల్యే కూడా ఇలాంటి ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అటువంటి చర్యను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేశారు. అధిక పనిభారం, ఒత్తిడి, వేధింపు వల్ల ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న బిఎల్వోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొంతమంది హత్యలకు గురయ్యారు.



