నవతెలంగాణ-హైదరాబాద్: ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించే అవకాశం లేదని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారికి మూడు నెలల పాటు జరిమానా నుండి మినహాయింపు ఉంటుందని అన్నారు. శుక్రవారం ఉదయం నాటికి 1.51 లక్షల ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. పోర్టల్లో నమోదు చేసుకోని వక్ఫ్ ఆస్తుల సంరక్షకులు (ముతవల్లీలు) వారి సంబంధిత వక్ఫ్ ట్రిబ్యునల్ను సంప్రదించాలని అన్నారు.
వక్ఫ్ ఆస్తుల రిజి జియోట్యాగింగ్ కోసం ఈ ఏడాది జూన్ 6న మోడీ ప్రభుత్వం ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి (ఉమీద్) పోర్టల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆరునెలల్లోపు అప్లోడ్ చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం విధించిన ఆరు నెలల గడువు నేటితో (శుక్రవారం) ముగియనుంది.
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కు నేటితో గడువు ముగియనుందని, కానీ లక్షలాది వక్ఫ్ ఆస్తులు ఇప్పటికీ నమోదు కాలేదని కిరణ్ రిజిజు అన్నారు. 9లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గడువు పొడిగించాలంటూ పలువురు ఎంపిలు, సామాజిక కార్యకర్తలు తనను సంప్రదించారని అన్నారు. ఇప్పటివరకు 1.51 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉమీద్ పోర్టల్లో నమోదయ్యాయని అన్నారు. కర్ణాటక, పంజాబ్, జమ్ముకాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలు నమోదు చేశాయని, కానీ మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. కొన్నిచోట్ల పోర్టల్ నెమ్మదిగా ఉందని, కొంతమంది వద్ద సరైన పత్రాలు లేవని అన్నారు.



