గ్రామంలో విషాదఛాయలు..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాణ గ్రామాన్ని విషాదం చుట్టుముట్టింది. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు.
ప్రచార వేడి తారస్థాయికి చేరిన తరుణంలో, మురళి మృతి గ్రామ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్నటివరకు ఉత్సాహంగా ఇంటింటి తిరిగి ప్రచారం చేసిన ఆయన..గ్రామాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి ప్రజా సేవ కోసం పెద్ద కలలు కన్నారు. కానీ ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా కుప్పకూలడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
ఎన్నికల సమరం తుది దశకు చేరుకున్న సమయంలో అభ్యర్థి ఆకస్మిక మృతి చోటుచేసుకోవడంతో గ్రామంలోనే కాకుండా మొత్తం మండలంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల హోరు మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది.



